కోమాలో తల్లిదండ్రులు.. అన్నకు తలకొరివి పెట్టిన చెల్లెలు.. హృదయవిదారక ఘటన

  • రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లిదండ్రులు కోమాలోకి
  • తల్లిదండ్రులు కోలుకుంటారని రెండు రోజులు వేచిచూసిన చెల్లెలు
  • స్పృహలోకి రాకపోవడంతో అన్న మృతదేహానికి అంత్యక్రియలు
  • అందరినీ కదిలించిన‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఓ విషాదకర ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. రోడ్డు ప్రమాదంలో కుమారుడు మరణించగా, తల్లిదండ్రులు కోమాలోకి వెళ్లారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారి కుమార్తె, తన అన్నకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ హృదయవిదారక ఘటన బూర్గంపహాడ్‌ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... కరకగూడెం మండలానికి చెందిన ఆడెపు సతీశ్‌, స్వప్న దంపతులకు కొడుకు మనోహర్‌ (19), కూతురు మాధురి ఉన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో తలకు గాయమైన సతీశ్‌, వైద్య పరీక్షల కోసం భార్య, కొడుకుతో కలిసి ఆటోలో భద్రాచలం బయల్దేరారు. బూర్గంపహాడ్‌ మండలం కోయగూడెం వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మనోహర్‌ చికిత్స పొందుతూ మరణించగా.. సతీశ్‌, స్వప్న తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లారు. దీంతో చెల్లెలు మాధురి, తల్లిదండ్రులు కోలుకుని వస్తారనే ఆశతో అన్న మృతదేహాన్ని రెండు రోజులపాటు ఫ్రీజర్‌లో ఉంచి ఎదురుచూసింది. సోమవారానికి కూడా వారి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బంధువులు, గ్రామస్థుల సహాయంతో కన్నీటి నడుమ తన అన్న మనోహర్‌కు అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Bhadradri Kothagudem
Road Accident
Burgampahad
Komagudem
Karaka Gudem
Auto Accident
Telangana News
Family Tragedy
Funeral
Manohar

More Telugu News